
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ ప్రాంతంలో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న అశోక్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గత కొంతకాలంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బాధితులు తెలిపారు. అధిక లాభాలు వస్తాయని, సమయానికి డబ్బులు తిరిగి అందజేస్తామని నమ్మించి, పలువురు స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో నగదు సేకరించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.5 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.
రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి పరార్…!!! కొన్ని రోజులుగా చిట్టీలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోవడంతో సభ్యులు అశోక్ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే ఇటీవల అశోక్ తన కుటుంబంతో కలిసి రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి పరారైనట్లు స్థానికులు ఆరోపించారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. రేయింబవళ్లు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము దక్కదేమోనన్న ఆందోళన బాధితుల్లో నెలకొంది.
ఇంటి ముందు బాధితుల ఆందోళన.. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన బాధితులు అశోక్ ఇంటి ముందు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ పొదుపులు అంతా చిట్టీల్లో పెట్టామని, ఇప్పుడు కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి చిట్టీల్లో పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొందరు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, చిట్టీల పేరుతో పెట్టుబడులు పెట్టే ముందు ప్రజలు పూర్తి వివరాలు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు

